Saturday, April 21, 2012

సర్‌ఛార్జీ వసూళ్లు ఆపాలి

  • ఇ-సేవా కమిషనర్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా
ఇ-సేవాలో సర్‌ఛార్జీల వసూళ్లను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇ-సేవా కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-సేవా కేంద్రాల్లో విద్యుత్‌ బిల్లులపై యూజర్‌ ఛార్జీల పేరుతో రూ.2 నుంచి రూ.25 వరకు అదనపు భారం వేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మెజార్టీ వినియోగదారుల దగ్గర ప్రతి బిల్లుపై రూ.5, రూ.10 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. పెంచిన ఛార్జీలతో నగరంలో మార్చిలోనే రూ.45లక్షల భారం పడిందని అన్నారు. అప్పటికే వివిధ రకాల ఛార్జీలు, ధరలు పెరిగి ఆందోళన చెందుతున్న ప్రజలపై అదనంగా యూజర్‌ ఛార్జీల వసూలుకు అనుమతించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రతి బిల్లుపై విద్యుత్‌ శాఖ నుంచి ఛార్జీ వసూలు చేస్తూనే తిరిగి ప్రజలపై భారాలు మోపడం సమంజసం కాదని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులపైనే యూజర్‌ ఛార్జీ వసూలు చేస్తున్నా భవిష్యత్‌లో అన్ని బిల్లులపైనా ఆ భారం వేసే ప్రమాదముందని తెలిపారు. కొత్తగా విధించిన యూజర్‌ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు. ఇప్పటికే నగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు నీటి ఛార్జీలు, అస్తిపన్ను, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రజలపై ఇ-సేవా వేస్తున్న సర్‌ ఛార్జీల మోత సామాన్యులకు భారమేనన్నారు. 


                    'ఐదు, పది రూపాయలూ ఓ భారమేనా?' అని అధికారులు, పాలకులు తేలిగ్గా తీసుకుంటున్నారని విమర్శిం చారు. 'ఏ శాఖకు ఆశాఖ ఇ-సేవకు44లో ఛార్జీ చెల్లిస్తున్నప్పటికీ తిరిగి ప్రజలపై భారాలు మోపేందుకు ప్రభుత్వం అనుమతించడం అవసరమా?' అని ప్రశ్నించారు. ఇ-సేవాలో యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని విడుదల చేసిన జిఒ నెంబర్‌ 31ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
                అనంతరం ఎం శ్రీనివాస్‌, ఎన్‌ సోమయ్య, ఎస్‌ సహదేవ్‌, ఎం వెంకటేశ్‌, ఇ-సేవా డిప్యూటీ డైరెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఆదినారాయణ, విఠల్‌, సిఐటియు నాయకులు అజరుబాబు, కిరణ్‌, కెవిపిఎస్‌ నగర కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Monday, April 16, 2012

ప్రభుత్వ చేతకానితనం వల్లే...



  • హైదరాబాద్‌లో అల్లర్లపై శాంతిర్యాలీలో మాజీ ఎంపి మధు
ప్రభుత్వ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లోని మాదన్నపేట, సైదాబాద్‌లో అల్లర్లు చెలరేగాయనీ, ఆ ఘర్షణలకు సంబంధించి న్యాయవిచారణ జరిపించాలనీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు అన్నారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌ చౌరస్తాలో ఆదివారం (15.04.12) నిర్వహించిన శాంతి ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మతోన్మాద శక్తులు ఇంటికి నాలుగొందల రూపాయల చొప్పున పంచి అల్లర్లకు కారణమయ్యాయన్నారు. దాడుల్లో సామాన్యులే గాయపడ్డారని తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని పోలీసులకే వదిలేయకూడదని, రాజకీయంగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, అప్పుడే మత ఘర్షణలు అదుపు చేయడం సులభమవుతుందని తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా కొన్ని మతోన్మాద శక్తులు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయన్నారు. మతోన్మాద ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయో? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో వెంటనే న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఘర్షణకు కారణమైన వారిని వదిలేసి, వాటితో ఎలాంటి సంబంధమూ లేనివారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కా మసీదు బాంబుపేలుడు సంఘటనలో అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావనీ, ఇవి జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అదుపు చేయాలనీ అన్నారు. సంగారెడ్డిలో ఘర్షణలను అదుపు చేయకపోవడం వల్లే హైదరాబాద్‌లోనూ మతోన్మాదులు రెచ్చిపోయారన్నారు. ఘర్షణలపై న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బయటికి తీయాలన్నారు.
          ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు జె.వెంకటేష్‌, ఎం.శ్రీనివాస్‌, ఎస్‌.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Friday, April 13, 2012

ఆయనో సైద్ధాంతిక యోధుడు


Tuesday, February 21, 2012

ప్రజాస్వామ్యం ఖూనీ....

మధుపై ఎంఐఎం దాడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స


                         పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓ మృతుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధుతో పాటు నగర నాయకులు ఎం శ్రీనివాస్‌పై పోలీసుల సమక్షంలోనే మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, కార్పొరేటర్‌ వాజీద్‌లు తమ అనుయాయులతో భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో మధు, ఎం శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిపిఎం స్థానిక నాయకులు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎంఐఎం నేతలు దాడికి పాల్పడడం ద్వారా తమ నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పాతబస్తీ తమ జాగీరుగా భావించే మజ్లిస్‌, ఇతర పార్టీలు పాతబస్తీలో ప్రవేశించడం సహించలేక పోతోంది. సిపిఎంపై గతంలోనూ పాతబస్తీలో మజ్లిస్‌ గూండాలు దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే పరామర్శకు పోయినపుడు దాడికి పాల్పడిన సందర్భం చూస్తుంటే ఎంఐఎం దుర్మార్గం ఏ పాటిదో అర్థమవుతోంది. 

                      40ఏళ్లుగా పాతబస్తీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అక్రమార్జనతో కోట్లు గడించిన నాయకులు రౌడీయిజం, గూండాయిజం ద్వారా రాజ్యమేలుతున్నారు. ఆ పార్టీని ఎదిరించిన యువతపై తప్పుడు కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరిపించడం, yదురించిన వారిని అణిచివేసే చర్యలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. 


        మృతుడు  సూసైడ్‌ నోట్‌లో రాశాడు. అయితే ఆ సూసైడ్‌ నోట్‌ను ఎమ్మెల్యే, పోలీసులు కనుమరుగు చేసేశారు. మరోనోట్‌ను మృతుడు ఇంటిలో పెట్టడం ద్వారా అసలు విషయం బయటపడింది. అతని చావుకు ఎంఐఎం, పోలీసులే కారణమని స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. 

Wednesday, February 15, 2012

రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌కు ప్రత్యేక వాటా కల్పించాలి

ఆదాయంలో పది శాతం నిధులు ఖర్చుచేయాలి 
సిపిఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
                ఈనెల 17న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు సముచిత న్యాయం కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు  సోమయ్య అధ్యక్షతన మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పదిశాతం నిధులను గ్రేటర్‌ అభివృద్ధికి ఖర్చుచేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. సాగర్‌ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. మెట్రో వాటర్‌బోర్డుకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నీటి బిల్లులు పెంచి ప్రజలపై భారాలు మోపిందని అన్నారు. అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మౌలిక వసతులు కల్పించకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన పేరుతో నగరంలోని 270 బస్తీలను శివారు ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. గ్రేటర్‌ బడ్జెట్‌లో 40శాతం నిధులను మురికివాడల అభివృద్ధికి కేటాయించాలని, దళితులకు 16 శాతం, గిరిజనులకు 8శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రచారమే తప్ప పనులు చేయడంలేదని విమర్శించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తోందని, కానీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని అన్నారు. 2010లో ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకానికి ఇంత వరకూ నిధులు కేటాయించలేదని చెప్పారు. గ్రేటర్‌లో జనాభాతో పాటు పన్నుల భారాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్‌లో ప్రజలకు రోజుకు 430 ఎంజిడిల తాగునీరు అవసరమైతే 345 ఎంజిడిల నీరు మాత్రమే సరఫరాచేస్తున్నారని, దీంతో కొన్ని కాలనీల్లో వారానికో సారి తాగునీరు వస్తోందన్నారు. నగరంలో తాగునీటి కొరత తీర్చడానిక,ి గోదావరి జలాలను తీసుకురావడానికి సుజల స్రవంతి పథకానికి రూ.3375కోట్లు కావాలని అంచనా వేశారని, నిధుల్లేక పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. 2011-12 బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.434కోట్లు కేటాయించి రూ.212కోట్లు మాత్రమే ఇచ్చారని, దీంతో వాటర్‌ బోర్డు అప్పుల్లో కూరుకుపోయిందని వివరించారు. గ్రేటర్‌ నుండి రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో 38 శాతం, జిఎస్‌డిపిలో 16శాతం ఆదాయం వస్తున్నా బడ్జెట్‌లో మాత్రమే ప్రత్యేక వాటా కల్పించడంలేదని అన్నారు. ఎంఎంటిఎస్‌-2 దశకు నిధులు కేటాయింపుకు పరిమితమయ్యారే తప్ప పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. 

Sunday, January 29, 2012

పెంచిన నీటి ఛార్జీలపై వాటర్‌ బోర్డు ముట్టడి


  • స్వల్ప లాఠీఛార్జి బ నాయకుల అరెస్టు
  • వారంలోగా ఛార్జీలు తగ్గించాలి
  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు డిమాండ్‌
                      'మేం ఈ భారాలు మోయలేం... పెంచిన నీటి ఛార్జీలు తక్షణం తగ్గించాలి' అని నినదిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగర ప్రజలు వాటర్‌బోర్డు కార్యాలయాన్ని దిగ్బంధించారు. 'నీటి ఛార్జీలు పెంచడమా... సిగ్గు సిగ్గు... ఎమ్డీ బయటికి రావాలి' అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక పక్క వాటర్‌ బోర్డు అధికారులకు సిపిఎం నాయకులు సమస్య వివరిస్తుండగానే ఖాకీలు వారిని అరెస్టు చేయడం మొదలు పెట్టారు. తమ నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, వెంటనే విడిచిపెట్టాలని ప్రజలు కార్యాలయం ఎదుటే రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మళ్లీ నాయకులను అరెస్టు చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై లాఠీఛార్జి చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సుమారు వందమందికిపైగా నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు మహిళలను కూడా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. అరెస్టయిన వారిలో సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి.నర్సింహారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌, సోమయ్య, చంద్రశేఖర్‌, రవి, ఎం.శ్రీనివాస్‌రావు, నగర కమిటీ సభ్యులు ఉన్నారు. 
                      అంతకుముందు కార్యాలయం వద్ద ఆందోళనకారులనుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను వారంలోగా తగ్గించాలని లేకపోతే అన్ని పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాటర్‌బోర్డు పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కొంత మంది బడాబాబులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు చెందిన సుమారు రూ.572 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయకుండా పేదలపై భారం మోపడం సిగ్గుచేటని అన్నారు. పైగా వాటర్‌ బోర్డు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు. జిహెచ్‌ఎంసి వసూలు చేసే ఆస్తిపన్నులో 25 శాతం నిధులను వాటర్‌బోర్డుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2009జిఓ జారీ చేసిందని వివరించారు. అప్పటి నుండి జిహెచ్‌ఎంసి నయాపైసా వాటర్‌బోర్డుకు చెల్లించడంలేదని, ప్రభుత్వం జారీ చేసిన జిఓలను ప్రభుత్వ సంస్థలే ఖాతరు చేయకుంటే సిఎం ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ఎవరు అడ్డొచ్చినా ప్రజా ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ తాగునీటితో వ్యాపారం చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. డిజి.నర్సింహారావు మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నీటి ఛార్జీలు పెంచిందన్నారు. బస్తీలు, కాలనీల్లో ఉన్న పబ్లిక్‌ నల్లాలను ఎత్తివేసి వాటికి మీటర్లు బిగించి ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు.
వాటర్‌బోర్డు సిజిఎంకు వినతి
            వాటర్‌బోర్డు సిజిఎం(రెవెన్యూ) సుందర్‌రాంరెడ్డికి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన మురికివాడల్లో నివసించేవారికి డొమెస్టిక్‌ ఛార్జీలు వేస్తామని, కమర్షియల్‌ బిల్లులు ఇస్తే వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చిన్నచిన్న షాపులకు డొమెస్టిక్‌ బిల్లులే ఇస్తామని చెప్పారు. 

Friday, January 13, 2012

నీటి ఛార్జీల పెంపుపై సమరం

  • సెక్షన్‌ కార్యాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు
  • కదిలివచ్చిన ప్రజానీకం
  • మంచినీటి వ్యాపారం మానుకోవాలి : సిపిఎం
             సర్కార్‌ నీటి వ్యాపారానికి వ్యతిరేకంగా సిపిఎం సమరశంఖం పూరించింది. నగరంలో పలుచోట్ల సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. సర్కార్‌ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మంచినీటి వ్యాపారం నుండి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. మంచినీటి వ్యాపారం మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ ప్రారంభించారని, పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోకుంటే ప్రతిఘటన తప్పదని అగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నీటి ఛార్జీలకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని 11 జోన్లలో జలమండలి కార్యాలయాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ధర్నాను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఘోషామహల్‌ దగ్గర ధర్నాలో ఎం శ్రీనివాసు, సికింద్రాబాద్‌ జోన్‌లో ఎన్‌ సోమయ్య, కాప్రా దగ్గర చంద్రశేఖర్‌, ఉప్పల్‌ కార్యాలయం దగ్గర రవి, అంబర్‌పేట్‌ కార్యాలయం వద్ద జోన్‌ కన్వీనర్‌ మహేందర్‌ మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం నగర ప్రజలపై నీటి ఛార్జీల భారాల్ని మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఓ పక్క పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ ఇప్పుడు నీటి ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై మోపిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదేంటని పౌరసంఘాలు ప్రశ్నిస్తే జలమండలి నష్టాల్లో ఉందని, తప్పుడు సమాధానం చెపుతున్నారని, ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని అన్నారు.                                   జలమండలి నష్టాలకు మేధావులు, ప్రజాసంఘాలు పరిష్కారాన్ని సూచించాయని, అయినా పట్టించుకోకుండా భారాలు పెంచడం భావ్యం కాదన్నారు. పైపులైన్ల లీకేజీ వల్ల 40 శాతం వృథా అవుతున్న నీటిని అరికట్టడంలో జలమండలి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. జలమండలికి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.147 కోట్లు బకాయిలున్నాయని, బడా వ్యాపార, పారిశ్రామిక వేత్తల నుండి మరో రూ. 520 కోట్లు బకాయిలను వసూలు చేయలేని చేతగాని స్థితిలో జలమండలి అధికారులు ఉన్నారని విమర్శించారు. గతంలోనే ప్రభుత్వం ప్రాపర్టీ పన్నులో 25 శాతం మంచినీటి బోర్డుకు చెందుతుందనే తీర్మానాన్ని బుట్టదాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. సంవత్సరానికి రూ. 600 కోట్ల రూపాయలు ఆస్తి పన్నుల రూపంలో వసూలవుతోందని, దాంట్లో నుంచే 25 శాతం వాటర్‌ బోర్డుకు కేటాయించాల్సి ఉందన్నారు. ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శి ఎం దశరథ్‌ మాట్లాడుతూ మురికి వాడలకు కిలోలీటర్‌కు ఒక్క రూపాయి మాత్రమే పెంచామని, పేదలకు పెద్దగా భారం ఉండదని జలమండలి అధికారులు చెప్పడం కాకమ్మకథలు మాత్రమేనని అన్నారు. ఇప్పటికే బిల్లుల మోత మోగిపోతుందని, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 15 కిలో లీటర్ల నీటిని వాడుతున్న 3.6 లక్షల వినియోగదారులపై నెలకు రూ. 80 రూపాయల అదనపు భారం పడుతోందని అన్నారు.

Tuesday, January 10, 2012

సమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండా


  • నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి
  • 12 అంశాలపై తీర్మానాలు
  • కార్యాచరణ అమలుకు నూతన కమిటీ కంకణం
  • విజయవంతంగా ముగిసిన నగర మహాసభలు
           ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండాగా 19వ నగర మహాసభల్లో నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో కామ్రేడ్‌ కె శేఖర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన నగర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం నాడు జరిగిన సభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర కార్యదర్శిగా ఆయన ఏడోసారి ఎన్నికయ్యారు. 26 మందితో నూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకున్నారు. కార్యదర్శివర్గం తొమ్మిది మందితో ఎన్నికైంది. వీరితో పాటు రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులను ఎన్నుకున్నారు. సభల్లో 12 ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్రకమిటీ సభ్యులు పి మధు, రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య తదితర అగ్రనేతలు పర్యవేక్షించారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌, టి జ్యోతి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి నరసింహారావు, మాజీ నగర కార్యదర్శి రఘుపాల్‌ తదితరులు హాజరయ్యారు. ప్రజల్లో మమేకమై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అగ్రనేతలు అమూల్యమైన పలుసూచనలు చేశారు. ప్రజాజీవితాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పోరాటాలు నిర్మించాలని వారు సూచించారు. రెండు రోజులపాటు జరిగిన సభలో ప్రతినిధులంతా ఉత్సాహంగా పాల్గొనడంతోపాటు క్రమశిక్షణ పాటించారు. సభల్లో లక్ష్యాలను నిర్దేశిస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. వర్గపోరాటాలు, నివాసప్రాంత సమస్యలపై పోరాటాలు సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని నిర్ణయించారు. చివరిగా '' ఆకలిమంటలు మలమలలాడే అనాధలంతా లేవండోరు'' అంటూ అంతర్జాతీయ విప్లవ గీతంతో మహాసభలు ముగిశాయి.
నూతనకమిటీ ఎన్నిక
                  సభలో 26 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి, నగర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎం శ్రీనివాస్‌, జె వెంకటేష్‌, ఎస్‌ నరసింహారెడ్డి, ఎం శ్రీనివాసరావు, జి యాదగిరిరావు, జె చంద్రశేఖర్‌, ఎన్‌ సోమయ్య, కె రవి ఎన్నికయ్యారు. నగర కమిటీ సభ్యులుగా ఎస్‌ సహదేవ్‌, కె ఈశ్వరరావు, జి నాగేశ్వరరావు, వి కామేష్‌ బాబు, పి గెల్వయ్య, ఎం చంద్రమోహన్‌, కె ఎన్‌ రాజన్న, యు ఎ నారాయణ, ఎన్‌ శ్రీనివాస్‌, సి అరుణ, సిహెచ్‌ లీలావతి, అష్రప్‌ అలీ, ఎం దశరథ్‌, జి విఠల్‌, ఎం వెంకటేష్‌, ఎం ధర్మానాయక్‌, పి నాగేశ్వర్‌ ఎన్నికయ్యారు. గత నగర కమిటీలో ఉన్న సత్తిరెడ్డి బాధ్యతల నుంచి వైదొలిగారు. కమిటీలో ఎం దశరథ్‌, జి విఠల్‌, ఎం వెంకటేష్‌, ఎం ధర్మానాయక్‌, పి నాగేశ్వర్‌ నూతనంగా సభ్యులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యదర్శివర్గంలో కొత్తగా ఎన్‌ సోమయ్య, కె.రవికి చోటు దక్కింది. ఇతర సభ్యులు పాతవారే తిరిగి ఎన్నికయ్యారు.
కార్యాచరణ అమలుకు నూతన కమిటీ కంకణం
               మహాసభల్లో రూపొందించిన భవిష్యత్తు కార్యాచరణ పటిష్టంగా అమలు చేయడమే కర్తవ్యంగా నూతన కమిటీ కంకణం కట్టుకుందని నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ అన్నారు. వర్గపోరాటాలు, నివాస ప్రాంత పోరాటాలతో పాటు, మధ్యతరగతి ప్రజలపై కేంద్రీకరించి పోరాటాలు సమన్వయం చేస్తామన్నారు. నిర్మాణపరంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి కావాల్సిన చర్యలు చేపడుతామన్నారు. పార్టీసభ్యత్వంతో పాటు, ప్రజాసంఘాల సభ్యత్వాన్ని పెంచుతామన్నారు. సభ్యుల సైద్ధాంతిక స్థాయిని మరింత పెంచడానికి అధ్యయన తరగతులు కొనసాగిస్తూనే మరిన్ని చర్యలు చేపడుతామని వివరించారు. మహాసభల్లో తీసుకున్న ఎజెండా, 2012 లక్ష్యాలు నెరవేర్చడానికి సన్నద్ధమౌతామని చెప్పారు. నీటిఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తక్షణ పోరాటం ఉంటుందన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. వీటితోపాటు రానున్న రోజుల్లో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. అదేవిధంగా సభల్లో ఆమోదించిన 12 తీర్మానాలకు అనుగుణంగా పోరాటాలుంటాయన్నారు. నగరంలో సమస్యలు ప్రసావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినా రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. నగరంలో 3.17లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని గుర్తించిందన్నారు. స్థలాలు ఇవ్వకుండా నగర శివారుల్లో ప్రభుత్వ భూములు లేవని సిఎం దాటవేస్తున్నారని విమర్శించారు. మలక్‌పేటలో ఉన్న 130 ఎకరాల రేస్‌కోర్సును నగర శివారుల్లోకి తరలించాలని, ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రూపాయి కిలో బియ్యం ఇచ్చిన ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి కిలో బియ్యం ఎవ్వరు అడిగారని నిత్యావసర ధరలు తగ్గించండని రచ్చబండలో ప్రశ్నించిన పేదలకు సమాధానంగా అవసరం లేని వారు రేషన్‌కార్డును ఇచ్చేయండని ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటని అన్నారు. నగరంలో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో రాష్ట్రప్రతి ప్రతిభపాటిల్‌ వంటమనిషికే వైద్యం అందక వైద్యులపై ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఈ దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. మెట్రోరైలు బాధితులకు నష్టపరిహారం అందించాలని, వారికి పునరావాసం కల్పించాకే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఇలా నగరంలో పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయా సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....  

Monday, January 9, 2012

మూసీనాలాలాను అభివృద్ధి చేయాలి

సిపిఎం 19వ నగర మహాసభల్లో తీర్మానము   ప్రవేశపెట్టారు. 
 నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించి మూసీనాలాను అభివృద్ధి చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నట్లు నాంపల్లి జోన్‌ కన్వీనర్‌  ఎం  వెంకటేష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూసీ నాలా కబ్జాలకు గురౌతోందని, చిన్నపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురౌతున్నాయని తెలిపారు. మూసీనది సుందరీకరణపేరుతో కోట్లరూపాయలతో రబ్బర్‌డ్యాంలు నిర్మించారని, వాటివల్ల మురుగునీరు పేరుకుపోయి దోమల బెడద పెరిగి స్థానిక ప్రజలు రోగాలకు గురౌతున్నారన్నారు. మూసీలో కబ్జాలకు పాల్పడుతున్నారని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నాలాకు ఇరువైపులా ఫెన్సింగ్‌ లేక అఫ్జల్‌సాగర్‌లో 2009లో ఇద్దరు పిల్లలు చనిపోయారన్నారు. కొంతమంది నాలాపై ఇళ్లు కట్టుకున్నారని వారికి పునరావాస నివాసాలు కల్పించి నాలాను అభివృద్ధి చేయాలని కోరారు. కిర్లోస్కర్‌ కన్సల్టెన్సీ సూచనలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రజాశక్తి సౌజన్యంతో..... 

మహిళలపై పెరుగుతున్న హింసను అరికట్టాలి

                  సిపిఎం 19వ నగర మహాసభల్లో తీర్మానము   ప్రవేశపెట్టారు. 
                     సరళీకరణ విధానాల వల్ల మహిళలపై హింస పెరిగిందని శశికళ పేర్కొన్నారు. పెరుగుతున్న పేదరికం, నిరుద్యోగం, అసహాయత, అభద్రత వల్ల నేరాలు, గృహహింస విపరీతంగా పెరిగాయన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. హింసను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. బడ్జెట్‌లో మహిళలకు వాటా పెంచాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోందన్నారు. మహిళల సమస్యల పట్ల సమగ్ర అవగాహన, నిబద్ధత ఉన్న వారిని మహిళా కమిషనర్‌గా నియమించి కమిషన్‌ను పునర్‌ వ్యవస్థీకరించాలని కోరారు. గృహహింస చట్టంతోపాటు మహిళా రక్షణ చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలన్నారు. అందుకు కావాల్సిన నిధులు, ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని కోరారు. మద్యం అమ్మకాలు నియంత్రించాలని, బెల్టుషాపులను రద్దుచేయాలని కోరారు. ఇలా దాదాపు 10 డిమాండ్లను తీర్మానంలో పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే డిమాండ్ల సాధనకోసం భవిష్యత్తులో ఉద్యమాలు చేయనున్నట్లు తెలిపారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....  ) 

నీటి ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ పోరాటాలకు సిద్ధమైన సిపిఎం

  • 12న సెక్షన్‌ కార్యాలయాల వద్ద ధర్నా
  • 17-25వరకు ఎస్‌ఎంఎస్‌, ఈ మెయిల్‌, వినతిపత్రాలు
  • 28న వాటర్‌బోర్డు ముట్టడి
  • మహాసభలో తీర్మానం
           నగరంలో జలమండలి అడ్డగోలుగా పెంచిన నీటిఛార్జీలపై సిపిఎం నగర కమిటీ పోరాటాలకు సిద్ధమైంది. పెంచిన ఛార్జీలు ఉపసంహరించే వరకూ వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. 19వ నగర మహాసభల సందర్భంగా ఈ మేరకు నగర కార్యదర్శి ఎం శ్రీనివాస్‌ నగరవ్యాప్త నిరసనలకు పిలుపునిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం భోజన విరామంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నగరకమిటీ సభ్యులు ఎస్‌ సహదేవ్‌, కామేష్‌బాబు, పి గెల్వయ్య, సోమయ్య పాల్గొని చేపట్టబోయే ఉద్యమాన్ని గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మురికివాడలు సహితం వదలకుండా జలమండలి అధికారులు భారీగా నీటి ఛార్జీలు పెంచారని విమర్శించారు. స్వల్పంగానే నీటిఛార్జీలు పెంచామని చెబుతూనే అందుకు భిన్నంగా ఇష్టమొచ్చినట్లు బిల్లులు వసూలు చేస్తున్నారన్నారు. నీటిఛార్జీల బిల్లులు చూసి ప్రజలు బెంబేలెత్తి పోతున్నారన్నారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోందన్నారు. గతం కంటే ప్రస్తుతం 150 శాతానికి పైగా అదనంగా బిల్లులు వస్తున్నాయన్నారు. ఇప్పటికే పెంచిన పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర ధరలతో నగరవాసులు అతలాకుతలం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా నష్టాల పేరుతో జలమండలి అధికారులు నీటి ఛార్జీలు పెంచడం సమంజసం కాదన్నారు. 
                 రాష్ట్ర ప్రభుత్వం బోర్డు అభివృద్ధికి ఏ మాత్రమూ నిధులు ఇవ్వడంలేదన్నారు. దీనికి తోడు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి చెల్లించాల్సిన బిల్లులు రూ.147 కోట్ల బకాయిలున్నాయన్నారు. అదేవిధంగా ప్రయివేటు సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, బడాబాబుల నుంచి రూ.520 కోట్ల బకాయిలు వసూలు చేయాల్సి ఉందన్నారు. ఈ బకాయిలు వసూలు చేయడంలో జలమండలి ఘోరంగా విఫలమైందన్నారు. ఆ దిశగా ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. బకాయిలు వసూలు చేయడంతో పాటు నీటి సరఫరాలో అవుతున్న 40 శాతం వృథాను నియంత్రించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్‌ వినియోగంలో కమర్షియల్‌ ఛార్జీల నుంచి మినహాయింపునివ్వాలన్నారు. తదితర ప్రత్యామ్నాయాలు అనుసరిస్తే నష్టాలు లేకుండా నీటి సరఫరా చేయొచ్చన్నారు. అవి చేయడానికి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ప్రజలపై భారాలు రుద్దడం సమంజసం కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెంచిన నీటిబిల్లులు ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలను కూడగట్టి పెంచిన నీటిఛార్జీలకు వ్యతరేకంగా 12వ తేదీన వాటర్‌బోర్డు సెక్షన్‌ ఆఫీసుల వద్ద ధర్నాలు చేస్తామన్నారు. 17 నుంచి 25వరకు కరపత్రాల పంపిణీ చేసి ప్రజల చేత వాటర్‌బోర్డు ఎండికి ఎస్‌ఎంఎస్‌లు, ఈ మెయిల్‌, ఫేస్‌బుక్‌లో మెస్సేజ్‌లు తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతామన్నారు. సంతకాల సేకరణ చేపడుతామన్నారు. అధికారులకు వినతిపత్రాలిస్తామన్నారు. అయినా స్పందించకుంటే 28న జలమండలి ప్రధాన కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఉద్యమాలకు సన్నద్ధం కావాలి


  • హైదరాబాద్‌ నగర 19వ మహాసభల్లో ఎస్‌ వీరయ్య
              ప్రజాసమస్యలు పరిష్కరిస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్‌పార్టీ, దాని మిత్రపక్షాలు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పూర్తిగా విఫలమయ్యాయని, పేదల సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం నిరంతరం పోరాటం చేస్తోందని, రాబోయేకాలం ఎర్రజెం డాదేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య అన్నారు. ముషీరాబాద్‌లోని శేఖర్‌నగర్‌ (ఖషీష్‌ ఫంక్షన్‌ హాల్‌)లో ఆదివారం నిర్వహించిన సిపిఎం హైదరాబాద్‌ నగర 19వ మహాసభలకు నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.నర్సింహారెడ్డి, నగర నాయకులు సోమయ్య, రవి, నాగలక్ష్మి, సత్తార్‌ అధ్య క్షవర్గంగా వ్యవహరించారు. ఈ మహాసభల్లో వీరయ్య ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని మైనార్టీ ప్రభుత్వం పాలిస్తోంది. మంత్రులు పరస్పరం ఆరో పణలు చేసుకుంటున్నారనీ చెప్పారు. తెలంగాణపై రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు కాంగ్రెస్‌, తెలుగుదేశం తమ వైఖరి చెప్పలేదని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం చెప్పడం శోచనీయమన్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీనే వేర్పాటువాద ఆందోళనలకు కారణమన్నారు. 2014లో జరిగే ఎన్నికల దాకా కేంద్రప్రభుత్వం తెలంగాణ విషయంలో కాలయాపన చేస్తుందని అన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నది ఒక్క సిపిఎం మాత్రమేనని, రానున్న రోజుల్లో మరిన్ని పోరాటాలు, ఉద్యమాలకు ప్రజలను సమయాత్తం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు వీరయ్య పిలుపునిచ్చారు.

Sunday, January 8, 2012

సంక్షేమ పథకాలకు తూట్లు

( ఈనాడు సౌజన్యంతో.....  )

కాంగ్రెస్‌కు శృంగభంగమే

  • సిపిఎం హైదరాబాద్‌ నగర మహాసభలో మధు
ప్రజాసమస్యల పరిష్కారంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో శృంగభంగం తప్పదని సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు పి మధు హెచ్చరించారు. హైదరాబాద్‌ 19వ నగర మహాసభలు శనివారం నాడు ప్రారంభమయ్యాయి. సభల ప్రారంభం సందర్భంగా గోల్కొండికాస్‌ రోడ్డు నగర కార్యాలయం నుంచి ముషీరాబాద్‌ పార్కు వరకు ర్యాలీ జరిగింది. అనంతరం ముషీరాబాద్‌ పార్కు వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సిపిఎం నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌.మూర్తి అధ్యక్షతన జరిగిన సభలో మధు మాట్లాడుతూ.. 42 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి అసమర్థ ముఖ్య మంత్రిని ఎక్కడా చూడలేదని కిరణ్‌కుమార్‌ రెడ్డి పాలనాతీరును నిశితంగా విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యాట్‌ పెంచి ప్రజలపై భారాలు మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ధరల తాకిడిలో ఓ వైపు ప్రజలు బతుకు భారమై అల్లాడుతుంటే మరోవైపు రకరకాల పన్నులు వేసి మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. విద్యుత్‌ ఛార్జీలు భారీగా పెంచడానికి సిద్ధమయ్యారన్నారు. కేబినెట్‌లో ఉన్న మంత్రులు బ్రాందీ, గుడుంబా, సిండికేట్‌ వ్యాపారాలు చేసుకుంటూ అవినీతిలో కూరుకు పోయారని విమర్శించారు. జగన్‌ అనుచర ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే తన పదవికి ఎసరు వస్తుందనే భయంతో కిరణ్‌కుమార్‌రెడ్డి కాలయాపన చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
                    సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సమస్యలు పరిష్కరించకపోగా భారాలేస్తోంద న్నారు. మరోవైపు సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. ఇది కోతల, వాతల ప్రభుత్వం తప్ప ప్రజల కోసం ఆలోచించే ప్రభుత్వం కాదని విమర్శించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాలు, సరళీకరణ విధానాలతో అవినీతి పాలక, ప్రతిపక్షం అన్న తేడా లేకుండా కనివినీ ఎరుగుని రీతిలో పాకిపోయిందన్నారు. అసలు రాష్ట్ర మంత్రిపైనే దాడి జరిగితే రక్షించలేని పోలీసులు సిపిఎం ర్యాలీ అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్ల నేడు కార్మికవర్గం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోం దన్నారు. ఫిబ్రవరి 28న జరిగే మరో దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర నాయకులు టి.జ్యోతి మాట్లాడుతూ మహిళలపై హింసను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంద న్నారు. మహిళలను లక్షాధికా రులను చేస్తామని గొప్పలు చెప్పి చివరకు మైక్రోఫైనాన్స్‌ ఊబిలోకి తోసిందని విమర్శించారు. పౌరసమస్యలు, ఇళ్లు, ఇళ్ల సమస్యలు, అధికధరలు తదితర అనేక అంశాలపై సిపిఎం నిర్వహించిన పోరాటాలను పిఎస్‌ఎన్‌.మూర్తి గుర్తుచేశారు. ఆదివారం నుంచి జరిగే రెండురోజుల ప్రతినిధుల సభలో ప్రజాసమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.
     ( ప్రజాశక్తి సౌజన్యంతో.....  ) 

Saturday, January 7, 2012

ఉద్యమాలే ఊపిరిగా సిపిఎం సుదీర్ఘ పోరాటం

ఉద్యమాలే ఊపిరిగా సిపిఎం సుదీర్ఘ పోరాటం

  • ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం రాజీలేని పోరు
  • కేసులకు నెరవక పేదలకు అండగా నిలబడిన తీరు
  • లాఠీ దెబ్బలకూ వెనకాడని వైనం
  • అదే స్ఫూర్తితో మరింత ముందుకు..
             ఉద్యమాలే ఊపిరిగా ప్రజాసమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఎం నగరంలో తనదైన శైలిలో పోరాటాలు సలుపుతోంది. పేద ప్రజలకు అండగా నిలిచి ఉద్యమాల్లో ముందుంటూ ప్రజాపోరాటాల వారధిగా కొనసాగుతోంది. ఓట్లు, సీట్లతో ప్రమేయం లేకుండా ప్రజా హక్కుల కోసం ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పోరాటాలు నిర్మిస్తూ ముందుకు సాగుతోంది. నీతి, నిజాయితీతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల పక్షాన నిలబడుతోంది. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రస్తుత ప్రభుత్వం తీరును ఎండగట్టాలని, ప్రజలపై మోపుతున్న భారాలను అడ్డుకోవాలని శనివారం నుంచి జరిగే 19 నగర మహాసభల్లో నాయకులు కార్యాచరణ రూపొందించనున్నారు. ఈ నేపథ్యంలో గత నగర మహాసభలనంతరం సిపిఎం చేపట్టిన పలు పోరాటాలను పరిశీలిస్తే ఇళ్లు, ఇళ్ల స్థలాల కోసం చేసిన పోరాటం రాజీలేనిది. గత మహాసభలకు ముందు తర్వాత గడిచిన నాలుగేళ్లుగా నగర వ్యాప్తంగా పలు బస్తీల్లో గుడిసెవాసులకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు అండగా నిలబడ్డారు. తామున్నామంటూ ధైర్యం చెప్పి ప్రజలను పెద్దఎత్తున కదిలించారు. గుడిసెలు కూల్చడానికి ప్రభుత్వం పోలీసు బలగాలతో దమనకాండకు దిగితే ఎదుర్కొన్నారు. అరెస్టులు చేసినా లాఠిచార్జీలతో రక్తం చిందించినా లెక్కచేయకుండా నిలబడ్డారు. స్థానికులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు, ప్రదర్శనలు చేశారు. కలెక్టరేట్‌, సిసిఎల్‌ఎ, జిహెచ్‌ఎంసి తదితర ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించారు. ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా సిపిఎం నేతృత్వంలో ఇళ్ల కోసం ప్రజలు 2008 ఏడాది మిలిటెంట్‌ పోరాటాల్లో ముందుకురికారు. నేటికీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలపై కేసులు నడుస్తున్నాయి. అయినా నెరవక సుదీర్ఘంగా పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నాలుగేళ్లలో చేసిన పలుపోరాటాల్లో మచ్చుకు కొన్ని పాఠకుల కోసం.
బోజగుట్ట : బోజగుట్టలో దాదాపు 42 ఎకరాలు సీలింగ్‌ భూమి ఉంది. అందులో గుడిసెలేసుకొని పేదలు సంవత్సరాలుగా నివశిస్తున్నారు. ఆ స్థలంపై భూకబ్జాదారుల కన్ను పడింది. బోగస్‌ సొసైటీలు పుట్టుకొచ్చాయి. స్థలాలు ఆక్రమించడానికి అడ్డుగా ఉన్న పేదలను ఖాళీచేయించడానికి సామ బేద దండోపాయాలు ప్రయోగించారు. పేదలకు అన్యాయం జరిగితే సహించబోమంటూ సిపిఎం నాయకులు ప్రజల పక్షాన నిలబడ్డారు. ప్రభుత్వానికి, కబ్జాదారులకు వ్యతిరేకంగా ఆందోళన, ధర్నా, రాస్తారోకో, నిరాహార దీక్షలు ఇలా పలురూపాల్లో పోరాడారు. మంత్రులు, అధికారులకు వినతిపత్రాలిచ్చారు. చివరకు సిపిఎం పోరాటానికి ప్రభుత్వం తలవంచి 13 ఎకరాల్లో పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వడానికి అంగీకరించింది. నాటి పోరాటంలో సిపిఎం నాయకులపై నేటికీ కేసులు నడుస్తున్నాయి.