Saturday, April 21, 2012

సర్‌ఛార్జీ వసూళ్లు ఆపాలి

  • ఇ-సేవా కమిషనర్‌ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా
ఇ-సేవాలో సర్‌ఛార్జీల వసూళ్లను ఆపాలని సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇ-సేవా కమిషనర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇ-సేవా కేంద్రాల్లో విద్యుత్‌ బిల్లులపై యూజర్‌ ఛార్జీల పేరుతో రూ.2 నుంచి రూ.25 వరకు అదనపు భారం వేస్తున్నారని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మెజార్టీ వినియోగదారుల దగ్గర ప్రతి బిల్లుపై రూ.5, రూ.10 వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. పెంచిన ఛార్జీలతో నగరంలో మార్చిలోనే రూ.45లక్షల భారం పడిందని అన్నారు. అప్పటికే వివిధ రకాల ఛార్జీలు, ధరలు పెరిగి ఆందోళన చెందుతున్న ప్రజలపై అదనంగా యూజర్‌ ఛార్జీల వసూలుకు అనుమతించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రతి బిల్లుపై విద్యుత్‌ శాఖ నుంచి ఛార్జీ వసూలు చేస్తూనే తిరిగి ప్రజలపై భారాలు మోపడం సమంజసం కాదని చెప్పారు. ప్రస్తుతం విద్యుత్‌ బిల్లులపైనే యూజర్‌ ఛార్జీ వసూలు చేస్తున్నా భవిష్యత్‌లో అన్ని బిల్లులపైనా ఆ భారం వేసే ప్రమాదముందని తెలిపారు. కొత్తగా విధించిన యూజర్‌ ఛార్జీలను వెంటనే రద్దు చేయాలని సిపిఎం నగర కమిటీ డిమాండ్‌ చేస్తోందన్నారు. ఇప్పటికే నగరంలోని సామాన్య, మధ్య తరగతి ప్రజలు నీటి ఛార్జీలు, అస్తిపన్ను, విద్యుత్‌ ఛార్జీల పెంపుతో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారన్నారు. ప్రజలపై ఇ-సేవా వేస్తున్న సర్‌ ఛార్జీల మోత సామాన్యులకు భారమేనన్నారు. 


                    'ఐదు, పది రూపాయలూ ఓ భారమేనా?' అని అధికారులు, పాలకులు తేలిగ్గా తీసుకుంటున్నారని విమర్శిం చారు. 'ఏ శాఖకు ఆశాఖ ఇ-సేవకు44లో ఛార్జీ చెల్లిస్తున్నప్పటికీ తిరిగి ప్రజలపై భారాలు మోపేందుకు ప్రభుత్వం అనుమతించడం అవసరమా?' అని ప్రశ్నించారు. ఇ-సేవాలో యూజర్‌ ఛార్జీలు వసూలు చేయాలని విడుదల చేసిన జిఒ నెంబర్‌ 31ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
                అనంతరం ఎం శ్రీనివాస్‌, ఎన్‌ సోమయ్య, ఎస్‌ సహదేవ్‌, ఎం వెంకటేశ్‌, ఇ-సేవా డిప్యూటీ డైరెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు ఆదినారాయణ, విఠల్‌, సిఐటియు నాయకులు అజరుబాబు, కిరణ్‌, కెవిపిఎస్‌ నగర కార్యదర్శి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.

Monday, April 16, 2012

ప్రభుత్వ చేతకానితనం వల్లే...



  • హైదరాబాద్‌లో అల్లర్లపై శాంతిర్యాలీలో మాజీ ఎంపి మధు
ప్రభుత్వ చేతగానితనం వల్లే హైదరాబాద్‌లోని మాదన్నపేట, సైదాబాద్‌లో అల్లర్లు చెలరేగాయనీ, ఆ ఘర్షణలకు సంబంధించి న్యాయవిచారణ జరిపించాలనీ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు అన్నారు. సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అబిడ్స్‌ చౌరస్తాలో ఆదివారం (15.04.12) నిర్వహించిన శాంతి ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని మతోన్మాద శక్తులు ఇంటికి నాలుగొందల రూపాయల చొప్పున పంచి అల్లర్లకు కారణమయ్యాయన్నారు. దాడుల్లో సామాన్యులే గాయపడ్డారని తెలిపారు. శాంతి భద్రతల విషయాన్ని పోలీసులకే వదిలేయకూడదని, రాజకీయంగా కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, అప్పుడే మత ఘర్షణలు అదుపు చేయడం సులభమవుతుందని తెలిపారు. హనుమాన్‌ జయంతి సందర్భంగా కొన్ని మతోన్మాద శక్తులు సుమారు రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలొచ్చాయన్నారు. మతోన్మాద ఘర్షణలు ఎందుకు జరుగుతున్నాయో? వీటిని ఎవరు ప్రోత్సహిస్తున్నారో వెంటనే న్యాయవిచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఘర్షణకు కారణమైన వారిని వదిలేసి, వాటితో ఎలాంటి సంబంధమూ లేనివారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మక్కా మసీదు బాంబుపేలుడు సంఘటనలో అసలు నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించి ఉంటే ఈ ఘటనలు జరిగేవి కావనీ, ఇవి జరగకుండా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని అదుపు చేయాలనీ అన్నారు. సంగారెడ్డిలో ఘర్షణలను అదుపు చేయకపోవడం వల్లే హైదరాబాద్‌లోనూ మతోన్మాదులు రెచ్చిపోయారన్నారు. ఘర్షణలపై న్యాయవిచారణ జరిపి వాస్తవాలు బయటికి తీయాలన్నారు.
          ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు జె.వెంకటేష్‌, ఎం.శ్రీనివాస్‌, ఎస్‌.నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Friday, April 13, 2012

ఆయనో సైద్ధాంతిక యోధుడు