Tuesday, February 21, 2012

ప్రజాస్వామ్యం ఖూనీ....

మధుపై ఎంఐఎం దాడి, ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స


                         పాతబస్తీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. ఓ మృతుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి మధుతో పాటు నగర నాయకులు ఎం శ్రీనివాస్‌పై పోలీసుల సమక్షంలోనే మజ్లిస్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, కార్పొరేటర్‌ వాజీద్‌లు తమ అనుయాయులతో భౌతిక దాడికి దిగారు. ఈ దాడిలో మధు, ఎం శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురు సిపిఎం స్థానిక నాయకులు గాయపడ్డారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఎంఐఎం నేతలు దాడికి పాల్పడడం ద్వారా తమ నిజస్వరూపాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పాతబస్తీ తమ జాగీరుగా భావించే మజ్లిస్‌, ఇతర పార్టీలు పాతబస్తీలో ప్రవేశించడం సహించలేక పోతోంది. సిపిఎంపై గతంలోనూ పాతబస్తీలో మజ్లిస్‌ గూండాలు దాడులు చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే పరామర్శకు పోయినపుడు దాడికి పాల్పడిన సందర్భం చూస్తుంటే ఎంఐఎం దుర్మార్గం ఏ పాటిదో అర్థమవుతోంది. 

                      40ఏళ్లుగా పాతబస్తీ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకున్న దాఖలాల్లేవు. మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి అక్రమార్జనతో కోట్లు గడించిన నాయకులు రౌడీయిజం, గూండాయిజం ద్వారా రాజ్యమేలుతున్నారు. ఆ పార్టీని ఎదిరించిన యువతపై తప్పుడు కేసులు బనాయించడం, రౌడీషీట్లు తెరిపించడం, yదురించిన వారిని అణిచివేసే చర్యలకు పాల్పడడం ఆనవాయితీగా మారింది. 


        మృతుడు  సూసైడ్‌ నోట్‌లో రాశాడు. అయితే ఆ సూసైడ్‌ నోట్‌ను ఎమ్మెల్యే, పోలీసులు కనుమరుగు చేసేశారు. మరోనోట్‌ను మృతుడు ఇంటిలో పెట్టడం ద్వారా అసలు విషయం బయటపడింది. అతని చావుకు ఎంఐఎం, పోలీసులే కారణమని స్థానిక ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. 

Wednesday, February 15, 2012

రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌కు ప్రత్యేక వాటా కల్పించాలి

ఆదాయంలో పది శాతం నిధులు ఖర్చుచేయాలి 
సిపిఎం రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు
                ఈనెల 17న ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు సముచిత న్యాయం కల్పించాలని పలువురు వక్తలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో నగర కార్యదర్శి వర్గ సభ్యులు  సోమయ్య అధ్యక్షతన మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో పదిశాతం నిధులను గ్రేటర్‌ అభివృద్ధికి ఖర్చుచేయాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా హజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి. సాగర్‌ మాట్లాడుతూ రాజ్యాంగానికి విరుద్ధంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కాజేస్తోందని, స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. మెట్రో వాటర్‌బోర్డుకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా నీటి బిల్లులు పెంచి ప్రజలపై భారాలు మోపిందని అన్నారు. అభివృద్ధికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. మౌలిక వసతులు కల్పించకుండా పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. రాజధాని అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని చెప్పారు. రాజీవ్‌ ఆవాస్‌ యోజన పేరుతో నగరంలోని 270 బస్తీలను శివారు ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు. గ్రేటర్‌ బడ్జెట్‌లో 40శాతం నిధులను మురికివాడల అభివృద్ధికి కేటాయించాలని, దళితులకు 16 శాతం, గిరిజనులకు 8శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాస్‌ మాట్లాడుతూ గ్రేటర్‌ హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తున్నామన్న ప్రచారమే తప్ప పనులు చేయడంలేదని విమర్శించారు. జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకానికి నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తోందని, కానీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయని అన్నారు. 2010లో ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకానికి ఇంత వరకూ నిధులు కేటాయించలేదని చెప్పారు. గ్రేటర్‌లో జనాభాతో పాటు పన్నుల భారాలు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. గ్రేటర్‌లో ప్రజలకు రోజుకు 430 ఎంజిడిల తాగునీరు అవసరమైతే 345 ఎంజిడిల నీరు మాత్రమే సరఫరాచేస్తున్నారని, దీంతో కొన్ని కాలనీల్లో వారానికో సారి తాగునీరు వస్తోందన్నారు. నగరంలో తాగునీటి కొరత తీర్చడానిక,ి గోదావరి జలాలను తీసుకురావడానికి సుజల స్రవంతి పథకానికి రూ.3375కోట్లు కావాలని అంచనా వేశారని, నిధుల్లేక పనులు నిలిచిపోయాయని గుర్తుచేశారు. 2011-12 బడ్జెట్‌లో వాటర్‌బోర్డుకు రూ.434కోట్లు కేటాయించి రూ.212కోట్లు మాత్రమే ఇచ్చారని, దీంతో వాటర్‌ బోర్డు అప్పుల్లో కూరుకుపోయిందని వివరించారు. గ్రేటర్‌ నుండి రాష్ట్ర రెవెన్యూ ఆదాయంలో 38 శాతం, జిఎస్‌డిపిలో 16శాతం ఆదాయం వస్తున్నా బడ్జెట్‌లో మాత్రమే ప్రత్యేక వాటా కల్పించడంలేదని అన్నారు. ఎంఎంటిఎస్‌-2 దశకు నిధులు కేటాయింపుకు పరిమితమయ్యారే తప్ప పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. 

Sunday, January 29, 2012

పెంచిన నీటి ఛార్జీలపై వాటర్‌ బోర్డు ముట్టడి


  • స్వల్ప లాఠీఛార్జి బ నాయకుల అరెస్టు
  • వారంలోగా ఛార్జీలు తగ్గించాలి
  • సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మధు డిమాండ్‌
                      'మేం ఈ భారాలు మోయలేం... పెంచిన నీటి ఛార్జీలు తక్షణం తగ్గించాలి' అని నినదిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగర ప్రజలు వాటర్‌బోర్డు కార్యాలయాన్ని దిగ్బంధించారు. 'నీటి ఛార్జీలు పెంచడమా... సిగ్గు సిగ్గు... ఎమ్డీ బయటికి రావాలి' అంటూ నినాదాలు చేశారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ప్రజలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఒక పక్క వాటర్‌ బోర్డు అధికారులకు సిపిఎం నాయకులు సమస్య వివరిస్తుండగానే ఖాకీలు వారిని అరెస్టు చేయడం మొదలు పెట్టారు. తమ నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని, వెంటనే విడిచిపెట్టాలని ప్రజలు కార్యాలయం ఎదుటే రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మళ్లీ నాయకులను అరెస్టు చేస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలపై లాఠీఛార్జి చేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న సుమారు వందమందికిపైగా నాయకులను అరెస్టు చేశారు. పోలీసులు మహిళలను కూడా ఈడ్చుకెళ్లి వాహనాల్లో ఎక్కించారు. అరెస్టయిన వారిలో సిపిఎం హైదరాబాద్‌ నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి.నర్సింహారావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.శ్రీనివాస్‌, సోమయ్య, చంద్రశేఖర్‌, రవి, ఎం.శ్రీనివాస్‌రావు, నగర కమిటీ సభ్యులు ఉన్నారు. 
                      అంతకుముందు కార్యాలయం వద్ద ఆందోళనకారులనుద్దేశించి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పి.మధు మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను వారంలోగా తగ్గించాలని లేకపోతే అన్ని పార్టీలను కలుపుకొని పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వాటర్‌బోర్డు పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కొంత మంది బడాబాబులు, పెద్దపెద్ద వ్యాపార సంస్థలకు చెందిన సుమారు రూ.572 కోట్ల బకాయిలు ఉన్నాయని, వాటిని వసూలు చేయకుండా పేదలపై భారం మోపడం సిగ్గుచేటని అన్నారు. పైగా వాటర్‌ బోర్డు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు. జిహెచ్‌ఎంసి వసూలు చేసే ఆస్తిపన్నులో 25 శాతం నిధులను వాటర్‌బోర్డుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం 2009జిఓ జారీ చేసిందని వివరించారు. అప్పటి నుండి జిహెచ్‌ఎంసి నయాపైసా వాటర్‌బోర్డుకు చెల్లించడంలేదని, ప్రభుత్వం జారీ చేసిన జిఓలను ప్రభుత్వ సంస్థలే ఖాతరు చేయకుంటే సిఎం ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వం అణచివేయాలని చూస్తోందని, ఎవరు అడ్డొచ్చినా ప్రజా ఉద్యమాలు ఆగవని హెచ్చరించారు. నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ తాగునీటితో వ్యాపారం చేసిన ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానికే దక్కుతుందని విమర్శించారు. డిజి.నర్సింహారావు మాట్లాడుతూ ప్రపంచబ్యాంకు విధానాల్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం నీటి ఛార్జీలు పెంచిందన్నారు. బస్తీలు, కాలనీల్లో ఉన్న పబ్లిక్‌ నల్లాలను ఎత్తివేసి వాటికి మీటర్లు బిగించి ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు.
వాటర్‌బోర్డు సిజిఎంకు వినతి
            వాటర్‌బోర్డు సిజిఎం(రెవెన్యూ) సుందర్‌రాంరెడ్డికి సిపిఎం నాయకులు వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన మురికివాడల్లో నివసించేవారికి డొమెస్టిక్‌ ఛార్జీలు వేస్తామని, కమర్షియల్‌ బిల్లులు ఇస్తే వాటిని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. చిన్నచిన్న షాపులకు డొమెస్టిక్‌ బిల్లులే ఇస్తామని చెప్పారు. 

Friday, January 13, 2012

నీటి ఛార్జీల పెంపుపై సమరం

  • సెక్షన్‌ కార్యాలయాల వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నాలు
  • కదిలివచ్చిన ప్రజానీకం
  • మంచినీటి వ్యాపారం మానుకోవాలి : సిపిఎం
             సర్కార్‌ నీటి వ్యాపారానికి వ్యతిరేకంగా సిపిఎం సమరశంఖం పూరించింది. నగరంలో పలుచోట్ల సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలకు ప్రజలు పెద్ద ఎత్తున కదిలి వచ్చారు. సర్కార్‌ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం మంచినీటి వ్యాపారం నుండి వైదొలగాలని డిమాండ్‌ చేశారు. మంచినీటి వ్యాపారం మానుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రపంచబ్యాంకు ఆదేశాల మేరకే ఈ ప్రక్రియ ప్రారంభించారని, పెంచిన ఛార్జీలను ఉపసంహరించుకోకుంటే ప్రతిఘటన తప్పదని అగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన నీటి ఛార్జీలకు నిరసనగా గురువారం హైదరాబాద్‌లోని 11 జోన్లలో జలమండలి కార్యాలయాల ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్‌లో ధర్నాను సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం శ్రీనివాసరావు, ఘోషామహల్‌ దగ్గర ధర్నాలో ఎం శ్రీనివాసు, సికింద్రాబాద్‌ జోన్‌లో ఎన్‌ సోమయ్య, కాప్రా దగ్గర చంద్రశేఖర్‌, ఉప్పల్‌ కార్యాలయం దగ్గర రవి, అంబర్‌పేట్‌ కార్యాలయం వద్ద జోన్‌ కన్వీనర్‌ మహేందర్‌ మాట్లాడారు. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారం నగర ప్రజలపై నీటి ఛార్జీల భారాల్ని మోపడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఓ పక్క పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ ఇప్పుడు నీటి ఛార్జీల భారాన్ని కూడా ప్రజలపై మోపిందని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదేంటని పౌరసంఘాలు ప్రశ్నిస్తే జలమండలి నష్టాల్లో ఉందని, తప్పుడు సమాధానం చెపుతున్నారని, ఇది పూర్తిగా బాధ్యతా రాహిత్యమని అన్నారు.                                   జలమండలి నష్టాలకు మేధావులు, ప్రజాసంఘాలు పరిష్కారాన్ని సూచించాయని, అయినా పట్టించుకోకుండా భారాలు పెంచడం భావ్యం కాదన్నారు. పైపులైన్ల లీకేజీ వల్ల 40 శాతం వృథా అవుతున్న నీటిని అరికట్టడంలో జలమండలి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని విమర్శించారు. జలమండలికి వివిధ ప్రభుత్వ కార్యాలయాలు సుమారు రూ.147 కోట్లు బకాయిలున్నాయని, బడా వ్యాపార, పారిశ్రామిక వేత్తల నుండి మరో రూ. 520 కోట్లు బకాయిలను వసూలు చేయలేని చేతగాని స్థితిలో జలమండలి అధికారులు ఉన్నారని విమర్శించారు. గతంలోనే ప్రభుత్వం ప్రాపర్టీ పన్నులో 25 శాతం మంచినీటి బోర్డుకు చెందుతుందనే తీర్మానాన్ని బుట్టదాఖలు చేయడాన్ని తప్పుపట్టారు. సంవత్సరానికి రూ. 600 కోట్ల రూపాయలు ఆస్తి పన్నుల రూపంలో వసూలవుతోందని, దాంట్లో నుంచే 25 శాతం వాటర్‌ బోర్డుకు కేటాయించాల్సి ఉందన్నారు. ముషీరాబాద్‌ జోన్‌ కార్యదర్శి ఎం దశరథ్‌ మాట్లాడుతూ మురికి వాడలకు కిలోలీటర్‌కు ఒక్క రూపాయి మాత్రమే పెంచామని, పేదలకు పెద్దగా భారం ఉండదని జలమండలి అధికారులు చెప్పడం కాకమ్మకథలు మాత్రమేనని అన్నారు. ఇప్పటికే బిల్లుల మోత మోగిపోతుందని, పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. 15 కిలో లీటర్ల నీటిని వాడుతున్న 3.6 లక్షల వినియోగదారులపై నెలకు రూ. 80 రూపాయల అదనపు భారం పడుతోందని అన్నారు.

Tuesday, January 10, 2012

సమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండా


  • నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి
  • 12 అంశాలపై తీర్మానాలు
  • కార్యాచరణ అమలుకు నూతన కమిటీ కంకణం
  • విజయవంతంగా ముగిసిన నగర మహాసభలు
           ప్రజాసమస్యల పరిష్కారమే సిపిఎం ఎజెండాగా 19వ నగర మహాసభల్లో నిర్ణయించారు. ఆది, సోమవారాల్లో కామ్రేడ్‌ కె శేఖర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన నగర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం నాడు జరిగిన సభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నగర కార్యదర్శిగా ఆయన ఏడోసారి ఎన్నికయ్యారు. 26 మందితో నూతన కమిటీని ప్రతినిధులు ఎన్నుకున్నారు. కార్యదర్శివర్గం తొమ్మిది మందితో ఎన్నికైంది. వీరితో పాటు రాష్ట్ర మహాసభలకు హాజరయ్యే ప్రతినిధులను ఎన్నుకున్నారు. సభల్లో 12 ప్రధాన అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. కేంద్రకమిటీ సభ్యులు పి మధు, రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌ వీరయ్య తదితర అగ్రనేతలు పర్యవేక్షించారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌ సుధాభాస్కర్‌, టి జ్యోతి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డిజి నరసింహారావు, మాజీ నగర కార్యదర్శి రఘుపాల్‌ తదితరులు హాజరయ్యారు. ప్రజల్లో మమేకమై ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి అగ్రనేతలు అమూల్యమైన పలుసూచనలు చేశారు. ప్రజాజీవితాన్ని అర్థం చేసుకుని అందుకు అనుగుణంగా పోరాటాలు నిర్మించాలని వారు సూచించారు. రెండు రోజులపాటు జరిగిన సభలో ప్రతినిధులంతా ఉత్సాహంగా పాల్గొనడంతోపాటు క్రమశిక్షణ పాటించారు. సభల్లో లక్ష్యాలను నిర్దేశిస్తూ భవిష్యత్తు కార్యాచరణ రూపొందించారు. వర్గపోరాటాలు, నివాసప్రాంత సమస్యలపై పోరాటాలు సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని నిర్ణయించారు. చివరిగా '' ఆకలిమంటలు మలమలలాడే అనాధలంతా లేవండోరు'' అంటూ అంతర్జాతీయ విప్లవ గీతంతో మహాసభలు ముగిశాయి.
నూతనకమిటీ ఎన్నిక
                  సభలో 26 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. నగర కార్యదర్శిగా పిఎస్‌ఎన్‌ మూర్తి, నగర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎం శ్రీనివాస్‌, జె వెంకటేష్‌, ఎస్‌ నరసింహారెడ్డి, ఎం శ్రీనివాసరావు, జి యాదగిరిరావు, జె చంద్రశేఖర్‌, ఎన్‌ సోమయ్య, కె రవి ఎన్నికయ్యారు. నగర కమిటీ సభ్యులుగా ఎస్‌ సహదేవ్‌, కె ఈశ్వరరావు, జి నాగేశ్వరరావు, వి కామేష్‌ బాబు, పి గెల్వయ్య, ఎం చంద్రమోహన్‌, కె ఎన్‌ రాజన్న, యు ఎ నారాయణ, ఎన్‌ శ్రీనివాస్‌, సి అరుణ, సిహెచ్‌ లీలావతి, అష్రప్‌ అలీ, ఎం దశరథ్‌, జి విఠల్‌, ఎం వెంకటేష్‌, ఎం ధర్మానాయక్‌, పి నాగేశ్వర్‌ ఎన్నికయ్యారు. గత నగర కమిటీలో ఉన్న సత్తిరెడ్డి బాధ్యతల నుంచి వైదొలిగారు. కమిటీలో ఎం దశరథ్‌, జి విఠల్‌, ఎం వెంకటేష్‌, ఎం ధర్మానాయక్‌, పి నాగేశ్వర్‌ నూతనంగా సభ్యులుగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కార్యదర్శివర్గంలో కొత్తగా ఎన్‌ సోమయ్య, కె.రవికి చోటు దక్కింది. ఇతర సభ్యులు పాతవారే తిరిగి ఎన్నికయ్యారు.
కార్యాచరణ అమలుకు నూతన కమిటీ కంకణం
               మహాసభల్లో రూపొందించిన భవిష్యత్తు కార్యాచరణ పటిష్టంగా అమలు చేయడమే కర్తవ్యంగా నూతన కమిటీ కంకణం కట్టుకుందని నగర కార్యదర్శి పిఎస్‌ఎన్‌ అన్నారు. వర్గపోరాటాలు, నివాస ప్రాంత పోరాటాలతో పాటు, మధ్యతరగతి ప్రజలపై కేంద్రీకరించి పోరాటాలు సమన్వయం చేస్తామన్నారు. నిర్మాణపరంగా ఉద్యమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడానికి కావాల్సిన చర్యలు చేపడుతామన్నారు. పార్టీసభ్యత్వంతో పాటు, ప్రజాసంఘాల సభ్యత్వాన్ని పెంచుతామన్నారు. సభ్యుల సైద్ధాంతిక స్థాయిని మరింత పెంచడానికి అధ్యయన తరగతులు కొనసాగిస్తూనే మరిన్ని చర్యలు చేపడుతామని వివరించారు. మహాసభల్లో తీసుకున్న ఎజెండా, 2012 లక్ష్యాలు నెరవేర్చడానికి సన్నద్ధమౌతామని చెప్పారు. నీటిఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా తక్షణ పోరాటం ఉంటుందన్నారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామన్నారు. వీటితోపాటు రానున్న రోజుల్లో రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు కోసం ఉద్యమాలు చేస్తామన్నారు. అదేవిధంగా సభల్లో ఆమోదించిన 12 తీర్మానాలకు అనుగుణంగా పోరాటాలుంటాయన్నారు. నగరంలో సమస్యలు ప్రసావిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించినా రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాల సమస్యలు పరిష్కారం కాలేదని చెప్పారు. నగరంలో 3.17లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తామని గుర్తించిందన్నారు. స్థలాలు ఇవ్వకుండా నగర శివారుల్లో ప్రభుత్వ భూములు లేవని సిఎం దాటవేస్తున్నారని విమర్శించారు. మలక్‌పేటలో ఉన్న 130 ఎకరాల రేస్‌కోర్సును నగర శివారుల్లోకి తరలించాలని, ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రూపాయి కిలో బియ్యం ఇచ్చిన ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూపాయి కిలో బియ్యం ఎవ్వరు అడిగారని నిత్యావసర ధరలు తగ్గించండని రచ్చబండలో ప్రశ్నించిన పేదలకు సమాధానంగా అవసరం లేని వారు రేషన్‌కార్డును ఇచ్చేయండని ముఖ్యమంత్రి అనడం సిగ్గుచేటని అన్నారు. నగరంలో విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉందని చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో రాష్ట్రప్రతి ప్రతిభపాటిల్‌ వంటమనిషికే వైద్యం అందక వైద్యులపై ఫిర్యాదు చేయడమే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. ఈ దుస్థితికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. మెట్రోరైలు బాధితులకు నష్టపరిహారం అందించాలని, వారికి పునరావాసం కల్పించాకే పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఇలా నగరంలో పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆయా సమస్యల పరిష్కారం చేయాలని కోరారు. లేదంటే సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....  

Monday, January 9, 2012

మూసీనాలాలాను అభివృద్ధి చేయాలి

సిపిఎం 19వ నగర మహాసభల్లో తీర్మానము   ప్రవేశపెట్టారు. 
 నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపించి మూసీనాలాను అభివృద్ధి చేయాలని సిపిఎం డిమాండ్‌ చేస్తున్నట్లు నాంపల్లి జోన్‌ కన్వీనర్‌  ఎం  వెంకటేష్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మూసీ నాలా కబ్జాలకు గురౌతోందని, చిన్నపాటి వర్షానికి కూడా లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురౌతున్నాయని తెలిపారు. మూసీనది సుందరీకరణపేరుతో కోట్లరూపాయలతో రబ్బర్‌డ్యాంలు నిర్మించారని, వాటివల్ల మురుగునీరు పేరుకుపోయి దోమల బెడద పెరిగి స్థానిక ప్రజలు రోగాలకు గురౌతున్నారన్నారు. మూసీలో కబ్జాలకు పాల్పడుతున్నారని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. నాలాకు ఇరువైపులా ఫెన్సింగ్‌ లేక అఫ్జల్‌సాగర్‌లో 2009లో ఇద్దరు పిల్లలు చనిపోయారన్నారు. కొంతమంది నాలాపై ఇళ్లు కట్టుకున్నారని వారికి పునరావాస నివాసాలు కల్పించి నాలాను అభివృద్ధి చేయాలని కోరారు. కిర్లోస్కర్‌ కన్సల్టెన్సీ సూచనలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.
ప్రజాశక్తి సౌజన్యంతో.....